కొత్తగా చేయూత పెన్షన్ కోసం ఎదురుచూసే వారికి శుభవార్త.. దసరాకు వారికి ధమాకా ఆఫర్!
కొత్త చేయూత పెన్షన్ ల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణా సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలైన ఒంటరి మహిళలు, వితంతువులు మొదలైన వారికి కొత్త పెన్షన్ ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించిన ప్రభుత్వం ఈ దరఖాస్తుల ప్రక్రియ ఒక వైపు కొనసాగుతుండగానే మరోవైపు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ప్రారంభించింది.
పెన్షన్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరిత గతిన పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు దసరా నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మంది అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత నెల 9వ తేదీ నుంచి సెర్ప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం మొదలుపెట్టింది.
మొదట దరఖాస్తు గడువు గత నెలాఖరు వరకు ఉన్నా, ధ్రువీకరణ పత్రాలు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురైనందున గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలనను ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని నిర్ణయించారు. పరిశీలన పూర్తయిన తర్వాత వచ్చే నెల మొదటి వారంలో లబ్ధిదారులను ఎంపిక చేసి దసరా నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు వంటి వర్గాల వారు ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. దరఖాస్తు సమయంలో డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదని, వెరిఫికేషన్ సమయానికి దగ్గర ఉంచుకుంటే సరిపోతుందని సూచించింది.
దరఖాస్తు చేసుకుంటున్న వారికి ఇబ్బంది లేకుండా ఒంటరి మహిళల కోసం తహసీల్దార్లతో పాటు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు కూడా ధ్రువీకరణ పత్రాలు జారీ చేయవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. వితంతువుల విషయంలో కూడా అదనపు వెసులుబాట్ల కోసం ప్రభుత్వ అనుమతి కోరారు.
ఈ చర్యల వల్ల దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరం కాగలదని, అర్హులైన వారందరికీ త్వరగా పెన్షన్ లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దసరా సందర్భంగా కొత్త లబ్ధిదారులకు పెన్షన్ అందించాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగు వేయటం నిజంగా వారికి శుభ పరిణామం.